ముక్కుసూటిగా మాట్లాడటం మంచు మోహన్బాబు నైజం. మనసులో ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతారు. క్యాజువల్గా సీరియస్ టాపిక్స్ గురించి ప్రశ్నలు వేయడం అలీకి అలవాటు. ఇప్పుడు మోహన్ బాబును అలీ ఏం అడుగుతారు? మోహన్ బాబు ఏం పేలుస్తారో? అని బుల్లితెర వీక్షకులతో పాటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.
హాస్యనటుడిగా, కథానాయకుడిగా వెండితెరపై విజయవంతమైన అలీ... 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడీ టాక్ షో 250వ ఎపిసోడ్ మైలురాయికి చేరుకుంది. 250వ ఎపిసోడ్కి మంచు మోహన్ బాబును అతిథిగా ఆహ్వానించారు. ఆయనతో చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.
ఇటీవల 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విష్ణు మంచు వచ్చారు. 'మనోజ్కు, నీకు గొడవలు అంట' అని, 'మా' ఎన్నికల గురించి అలీ ప్రశ్నించారు. విష్ణు చాలా అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అలాగే, మంచు కుటుంబ విషయాలూ డిస్కస్ చేశారు. 'మా' ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ టాక్ షోలో మోహన్ బాబు ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారా? పరిశ్రమలో సమస్యలను ప్రస్తావిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.